మనం సెటిలర్స్ కాదు.. ఇది మన గడ్డ.. ఇక్కడే జీవిస్తున్నాం : తుమ్మల నాగేశ్వర రావు

మంగళవారం, 28 నవంబరు 2023 (10:11 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రజలను సెటిలర్స్ పేరుతో పిలుస్తుంటారు. ఇకపై సెటిలర్స్ అనే పదం వినిపించకూడదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పిలుపునిచ్చారు. సెటిలర్స్ అనే మాట తీసేయాలి... ఇది మన గడ్డ... ఇక్కడే జీవిస్తున్నాం... ఎవడబ్బ సొత్తు కాదని కాంగ్రెస్ పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 
 
ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యం... రామరాజ్యాన్ని చూశామన్నారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవ రాజకీయాలు నేర్పితే ఆత్మవిశ్వాస రాజకీయాలు నేర్పింది చంద్రబాబే అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలన్నారు. ఐటీ టవర్లు.. ఔటర్ రింగు రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వంటి వాటితో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా చంద్రబాబు పునాది వేశారన్నారు. 2020 విజన్ ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కితాబిచ్చారు.
 
రాజకీయంగా నష్టపోయినా తెలంగాణ ఏర్పాటుతో సోనియా గాంధీ చరిత్రలో నిలిచారన్నారు. తెలంగాణలో దారుణమైన పాలన ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు మాఫియాగా మారారని ఆరోపించారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం కాంగ్రెస్ మార్పును కోరుతోందన్నారు. ఓ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీనే ఈ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు