జంప్ జిలానీ... రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ అభ్యర్థి..

ఠాగూర్

బుధవారం, 20 మార్చి 2024 (10:07 IST)
సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి మే 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిపికేషన్ జారీచేసింది. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రాజకీయాలు ఊపందుకున్నాయి. డిసెంబరు నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్ నారాయణన్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం రాత్రి ఆయన హస్తం పార్టీ గూటికి చేరారు. ఆయనకు టిక్కెట్ ఇస్తామని టీ పీసీసీ చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బీజేపీ అభ్యర్థి రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీలో చేరారు. 
 
కాగా, మంగళవారం రాత్రి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ నివాసంలో పార్టీ ఇతర నేతలు మైనంపల్లి హన్మంత రావు, మహేందర్ రెడ్డి సమక్షంలో గణేశ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గణేశ్‌తో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై శ్రీగణేశ్ మాట్లాడారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారాని అన్నారు. 
 
లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ సత్తాచాటుతుందని శ్రీగణేశ్ నారాయణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా పార్టీ అగ్రనేతలు, మాజీ ఎమ్మెల్యేలు పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావుతో చర్చలు జరిపానని, సంప్రదింపులు సఫలీకృతమవడంతో కాంగ్రెస్లో చేరినట్లు వివరించారు. కాగా మంగళవారం మధ్యా హ్నం వరకు బీజేపీ తరపున ఆయన ప్రచారం చేశారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనూహ్యంగా గంటల వ్యవధిలోనే ఆయన పార్టీ మారడంపై బీజేపీ శ్రేణులు షాక్కు గురవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు