తాను ఉన్నంతకాలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీలో చోటులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ తాను పదవిలో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ఆ కుటుంబమే తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన శత్రువని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, మంత్రులకు శాఖల కేటాయింపు తదితర అంశాలపై ఢిల్లీలో అధిష్టానంతో ఎలాంటి చర్చలు జరపలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ముఖ్య నేతలందరితో చర్చలు జరిపి ఆ తర్వాతే శాఖల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా కర్నాటకలో కులగణన అంశంపై మాత్రమే అధిష్టానంతో చర్చించినట్టు రేవంత్ రెడ్డి వివరించారు.
అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని సీఎం వెల్లడించారు. రాబోయే రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటుచేసి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను బహిర్గతం చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, ఇతర అంశాలపై స్పష్టత ఇస్తామని ఆయన తెలిపారు.