అధిక ఫీజులు వ‌సూలు చేస్తే...ఖ‌బ‌డ్డార్ : జ‌స్టిస్ కాంతారావు

గురువారం, 29 జులై 2021 (15:29 IST)
విద్యాసంస్థ‌ల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని జస్టిస్ కాంతారావు హెచ్చ‌రించారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ రాష్ట్రంలోని విద్యా సంస్థలు తమ తీరు మార్చుకోవడం లేదని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు, ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో ప్రభుత్వం ఇది వరకే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అయినా ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయన్నారు.
 
కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన కొన్ని విద్యాసంస్థలు అధిక ఫీజు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆన్లైన్ క్లాసులకు అనుమతి ఇచ్చినంత మాత్రాన, ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేసుకోమని చెప్పినట్లు కాదని ఆయన అన్నారు.

ప్రైవేటు పాఠశాలలు జూనియర్ కళాశాలలు తప్పనిసరిగా, గత సంవత్సరం ట్యూషన్ ఫీజు మాత్రమే కట్టించుకోవాలని తెలిపారు. అది కూడా వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలని జస్టిస్. కాంతారావు స్పష్టం చేశారు. దీనికి అదనంగా ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని హెచ్చరించారు. 
 
మరోవైపు, మార్చి నెల నుంచి ఈ ప్రైవేటు విద్యాసంస్థలు ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని మౌఖిక ఆదేశాలతో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు, జీతాలు ఇవ్వట్లేదని ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. తక్షణమే సిబ్బందికి జీతాలు అందించాలని, తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. దీన్ని బేఖాతరు చేసే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
డిఈఓలు, ఆర్జేడీలు, ఆర్ఐవోలు తమ పరిధిలో తల్లిదండ్రులతో, ప్రైవేట్ ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న, ఉద్యోగులకు జీతాలు ఇవ్వని విద్యాసంస్థలను గుర్తించాలని ఆయన సూచించారు. తమ స్థాయిలో సమస్యల పరిష్కారానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉల్లంఘనలకు పాల్పడిన విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. 
 
విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేటు ఉపాధ్యాయులు తమ సమస్యలను నేరుగా రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ కు కూడా తెలియ చేయవచ్చని జస్టిస్ కాంతారావు వెల్లడించారు. 
 
9150381111 కు ఫోన్ ద్వారా (ఫోన్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది), [email protected] కు ఈ - మెయిల్ ద్వారా, www.apsermc.ap.gov.in పోర్టల్ లో గ్రీవెన్స్ అనే లింక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు