ఓ నిర్మాణ సంస్థ నుంచి తీసుకున్న రూ.21 కోట్ల రుణానికి వడ్డీతో కలిసి మొత్తం చెల్లించాలని హీరో విశాల్కు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్కు రూ.21 కోట్లను 30 శాతం వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. గత కొంతకాలంగా విశాల్కు, లైకా ప్రొడక్షన్స్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదంలో ఈ తీర్పు కీలక పరిణామంగా మారింది.
హీరో విశాల్ 2016లో తన 'మరుదు' సినిమా నిర్మాణం కోసం లైకా ప్రొడక్షన్స్ నుంచి రూ.15 కోట్ల ఆర్థిక సహాయం తీసుకున్నారు. ఈ మొత్తానికి 30 శాతం వడ్డీ చెల్లించేలా ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, ఆ తర్వాత విశాల్ తన మరో చిత్రం 'వీరమే వాగై సూడుమ్ ' సినిమా హక్కులను వేరొక సంస్థకు విక్రయించారు. ఇది తమ మధ్య కుదిరిన ఒప్పందానికి విరుద్ధమని లైకా ప్రొడక్షన్స్ ఆరోపించింది.
తమకు రావాల్సిన బాకీ చెల్లించకుండా, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సినిమా హక్కులను వేరేవారికి అమ్మడంపై లైకా ప్రొడక్షన్స్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం, విశాల్ చర్యలను ఒప్పంద ఉల్లంఘనగా పరిగణించింది. విశాల్ వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోర్టు, అసలు మొత్తం రూ.15 కోట్లతో పాటు, వడ్డీ కలిపి మొత్తం రూ.21 కోట్లను లైకా ప్రొడక్షన్స్కు చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు విశాలు ఆర్థికంగా పెద్ద దెబ్బ అని సినీ వర్గాలు అంటున్నాయి.