ఆకలి తీర్చుతున్న అమ్మ క్యాంటీన్లు... ఆంధ్రాలో అన్నా క్యాంటీన్లు మూసివేత

శనివారం, 11 ఏప్రియల్ 2020 (15:27 IST)
కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశం మొత్తం బంద్ అయింది. దీంతో అనేక మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. ముఖ్యంగా వలస కూలీల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఒకవైపు చేసేందుకు పనులు లేక ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి వారికి పూటగడవడం అత్యంత క్లిష్టంగా మారింది. అయితే, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్లు ఇపుడు పేదలపాలిట అక్షయపాత్రలుగా మారాయి. ముఖ్యంగా, మహానగరమైన చెన్నైలో ఈ క్యాంటీన్లకు మంచి ఆదరణ ఉంది. 
 
రెక్కాడితేగానీ డొక్కాడని వారి ఆకలిదప్పులు తీర్చడంలో అమ్మ క్యాంటీన్లు ముందున్నాయి. చెన్నై న‌గ‌ర‌పాల‌క సంస్థ అధికారులు అమ్మ క్యాంటీన్ల ద్వారా ఎన్నో లక్షల మందికి కడుపునింపుతున్నారు. సాధార‌ణ రోజుల్లో అమ్మ క్యాంటీన్‌ల ద్వారా రోజు 5 ల‌క్ష‌ల మందికి భోజ‌నం అందిచేవార‌ు. కానీ, లాక్‌డౌన్ రోజుల్లో ఈ సంఖ్య 11 ల‌క్ష‌లకు చేరింది. అమ్మ క్యాంటీన్ల నిర్వ‌హ‌ణ కోసం అవ‌స‌ర‌మైన స‌రుకులను నగర పాలక సంస్థే స్వయంగా సమకూర్చుతోంది. ఈ లాక్‌డౌన్ కొనసాగినన్ని రోజులు ఈ క్యాంటీన్లను నడిపేందుకు చెన్నై కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూసివేశారు. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చినా వైకాపా సర్కాపు పట్టించుకోలేదు. దీంతో లక్షలాది మంది పేదలు, దినసరికూలీలు ఆకలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా, లాక్‌డౌన్ సమయంలో ఈ క్యాంటీన్లు ఉండివుంటే ఎంతో మంది పేదులకు ఆకలి తీర్చేవని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు