దక్షిణ చైనా సముద్రజలాల్లో భారత యుద్ధనౌక... చర్చలు ఫలించకుంటే యుద్ధమేనా?

సోమవారం, 31 ఆగస్టు 2020 (09:56 IST)
చైనాతో అమీతుమి తేల్చుకునేందుకు భారత్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సైనికాధికారుల మధ్య జరుగుతున్న చర్చలు ఫలించన పక్షంలో అటోఇటో తేల్చుకోవాలన్న కృతనిశ్చయంతో భారత్ ఉంది. ఇందుకోసం తమ సైనిక దళాలను సర్వసన్నద్ధం చేస్తోంది. ఇందులోభాగంగా, దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి యుద్ధ నౌకను భారత్ పంపించింది. దీన్ని చూసిన చైనా ఒకింత ఉలికిపాటుకు గురైంది. 
 
గత జూన్ నెలలో తూర్పు లడఖ్ సమీపంలోని గాల్వాన్ లోయలో చైనా సైనికులు హద్దుమీరి భారత సైనికులపై దాడి చేశారు. ఈ దాడిలో 21 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత్ పలు కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంది. ముఖ్యంగా, తొలుత వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించింది. 
 
ఇపుడు మరో కీలక అడుగు వేసింది. దక్షిణ చైనా సముద్రంలోకి తన యుద్ధ నౌకను పంపింది. చైనా అధికారులతో భారత్ జరుపుతున్న ద్వైపాక్షిక చర్చలు ఎటూ తేలకపోవడం, చర్చలు ఫలవంతం కాకుంటే తదుపరి నిర్ణయాలు వేరేలా ఉంటాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో, మన యుద్ధనౌక చైనా సముద్రంలోకి వెళ్లడం కలకలం రేపుతోంది.
 
"గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించిన తరువాత, కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా భారత నౌకాదళం, తన వార్ షిప్‌ను దక్షిణ చైనా సముద్రంలోకి పంపింది. దక్షిణ చైనా సముద్రంలోని అత్యధిక భాగం తన పరిధిలోనికే వస్తుందని వాదిస్తున్న చైనా లిబరేషన్ ఆర్మీ అక్కడ మరొకరి ఉనికిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది" అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
 
నిజానికి సౌత్ చైనా సీపై తమకే పూర్తి ఆధిపత్యం ఉందంటూ చైనా భజన చేస్తూ వస్తోంది. కానీ, ప్రపంచ దేశాలు మాత్రం చైనా వాదనను తోసిపుచ్చుతున్నాయి. ఈ క్రమంలో 2009 తర్వాత దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలను సృష్టించిన చైనా, తన సైనిక అవసరాలను అక్కడి నుంచి తీర్చుకుంటున్న సంగతి తెలిసిందే.
 
ఇదిలావుండగా, దక్షిణ చైనా సముద్రంలో అమెరికా ఇప్పటికే తన యుద్ధ నౌకలను మోహరించిన సంగతి తెలిసిందే. ఇక్కడ యూఎస్, ఇండియాలు కలిసి నావికా దళ విన్యాసాలను సైతం ప్రారంభించాయి. భారత వార్ షిప్, అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని మలక్కా జలసంధి సమీపంలో మోహరించింది. ఈ సముద్ర జలాలు తమ పరిధిలోనివేనని అంటున్న ఇండియా, ఇదే ప్రాంతానికి జలాంతర్గాములను సైతం పంపాలని నిర్ణయించిందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు