పీవోకే కూడా భారత భూభాగమే... అమిత్ షా : నెక్స్ట్ టార్గెట్ అదేనా?

మంగళవారం, 6 ఆగస్టు 2019 (15:29 IST)
కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన ఆర్టికల్ 370ని మోడీ సర్కారు రద్దు చేసింది.

ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో జమ్మూకాశ్మీర్ విభజన బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ, కాశ్మీరులో ప్రజలు దశాబ్దాల తరబడి అన్యాయానికి గురవుతుంటే, ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ వారిని పట్టించుకోలేదని ఆరోపించారు. కాశ్మీరులో ఉద్రిక్తతలకు కారణం కాంగ్రెస్ వైఖరేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇప్పటికే రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం పొందిందని, రాష్ట్రపతి కూడా బిల్లు పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారని తెలిపారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందేందుకు విపక్ష పార్టీలు సహకరిస్తే.. ప్రజలు హర్షిస్తారని స్పష్టం చేశారు. ఈ బిల్లు అమలైతే కాశ్మీర్ వాసులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. జమ్మూ కాశ్మీర్ అంశంతో ఇతర దేశాలకు, ముఖ్యంగా పాకిస్థాన్‌కు ఏ మాత్రం సంబంధం లేదని, ప్రస్తుతం పాక్ ఆక్రమిత ప్రాంతంగా ఉన్న కాశ్మీర్ కూడా భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆ ప్రాంతం నుంచి వైదొలగాలని హితవు పలికారు.
 
అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పీవోకేలో ఉగ్ర శిబిరాలను ఏర్పాటు చేసి శిక్షణ పొందుతున్నాయి. ఆ తర్వాత బంగ్లాదేశ్, మయన్మార్, హిమాలయా పర్వతాల మీదుగా భారత భూభాగంలోకి చొరబడి... విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నాయి. ఈ క్రమంలో పీవోకే కూడా భారత్‌లో ఓ అంతర్భాగమని అమిత్ షా ప్రకటించడంతో ఆ ప్రాంతంపై మోడీ - షా ద్వయం గురిపెట్టినట్టు తెలుస్తోంది. మొత్తంమీ కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేలా కేంద్రం పావులు కదుపుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు