ఇకపై అలా చేస్తే సెల్‌ఫోన్ సీజ్... తిక్క కుదురుతుంది...

శనివారం, 7 జులై 2018 (13:43 IST)
ఎన్నిసార్లు చెప్పాలి.. ఎన్నిసార్లు ఫైన్స్ వేయాలి.. ఎంత మందికి అని జరిమానాలు విధించాలి. కారు, బైక్స్ సీజ్ చేస్తున్నా వినటం లేదు.. జైలుకి పంపిస్తాం అని చెప్పినా మార్పు రావడంలేదు. కళ్ల ఎదుట ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదు. ఇదంతా సెల్‌ఫోన్ డ్రైవింగ్ గురించి చెబుతున్న మాటలు. ఇక నుంచి ఫోన్ డ్రైవింగ్‌లో నిబంధనలను మార్చాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో కఠిన చర్యలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
 
ఇటీవలికాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిపై అక్కడి హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ విచారించిన కోర్టు.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారికి రూ.5 వేలు జరిమానా విధించాలని ఆదేశించింది. అయినా పెద్దగా మార్పు రాలేదు. దీనిపై సీరియస్ అయిన కోర్టు.. వాహనం కాకుండా సెల్ ఫోన్లనే సీజ్ చేయమని ఆదేశించింది. 
 
డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి సంబంధించిన మొబైల్ ఫోన్లను సీజ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 24 గంటలు స్విచ్ఛాప్ చేయాలని కోరింది. అందుకు రసీదు ఇవ్వాలని చెప్పింది. మొబైల్ ఫోనే జీవితంగా బతికేస్తున్నారని.. అన్ని కూడా ఫోన్ల ద్వారా చేస్తున్నారని.. అలాంటి ఫోన్‌ను సీజ్ చేస్తే తిక్క కుదురుతుందని వ్యాఖ్యానించింది. 24 గంటల తర్వాత తిరిగి ఇవ్వాలని పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది.
 
రెండో సారి కూడా దొరికితే.. మొబైల్ ఫోన్ తోపాటు వాహనాన్ని కూడా సీజ్ చేయాలని.. అప్పుడే మార్పు వస్తుందని అభిప్రాయడింది. రోడ్ సేఫ్టీపై అవగాహన కోసం పలు కార్యక్రమాలు చేపట్టాలని కూడా కోర్టు సూచన చేసింది. మొబైల్ ఫోన్లను సీజ్ చేయటం అనేది దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అన్నం లేకపోయినా బతికేస్తారు.. ఫోన్ లేకపోతే మాత్రం బతకలేని రోజులు.. అలాంటి స్మార్ట్ ఫోన్ ఒక్క రోజు లేకపోతే ఎలా అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు