మాస్క్ లేకుంటే స్పాట్ ఫైన్ రూ.100, ఎవ‌రైనా ఫోటో తీస్తే అంతే

సోమవారం, 12 జులై 2021 (14:36 IST)
మీరు మాస్క్ ధ‌రించ‌లేదా? అయితే పోలీసులే కాదు... మీ ప‌క్క‌నున్న‌వారు కూడా ఫోటో తీసి ఫైన్ ప‌డేలా చేయ‌చ్చు. ఏపీలో ఈ వినూత్న ఫైన్ విధానం అమ‌ల్లోకి వ‌చ్చింది. క‌రోనా మూడో వేవ్ ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం ముఖ్యంగా భావిస్తోంది. అందుకే కోవిడ్‌ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.

కోవిడ్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాస్క్‌ ధరించకపోతే రూ.100ల జరిమానా స్పాట్ లో కచ్చితంగా అమలు చేయాల‌ని నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందే.

ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలతో పాటు అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ప్రభుత్వం ఆదేశించింది. ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఎవరైనా ఫొటో తీసి పంపినా, జరిమానాలు విధించే విధంగా దీని కోసం ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ కఠినంగా అమలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలతో పాటు మార్కెట్లు, తదితర చోట్ల కూడా మాస్క్‌లు ధరించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కెట్ కమిటీలు మాస్క్‌లు ధరించేలా చూడాలంటూ ఆదేశించారు.
అన్నిజిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ 
 
ఏపీలో అన్నిజిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకూ సడలింపులు ఇచ్చారు. రాత్రి 9 గంటలకల్లా దుకాణాల మూసివేత, 10 గంటల తర్వాత అమల్లోకి కర్ఫ్యూ ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు