బడ్జెట్ 2021-22 : పట్టాలెక్కని హామీలు - అమరావతికి రైలు ఊసేది?

ఆదివారం, 31 జనవరి 2021 (08:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా, విశాఖపట్టణానికి రైల్వే జోన్ కేటాయించడం. రాష్ట్ర విభజన జరిగి సంవత్సరాలు గడిచిపోతున్నా ఒక్కటంటే ఒక్క హామీ కూడా పట్టాలెక్కలేదు. అందులో ఒకటి విశాఖ రైల్వే జోన్. 
 
విశాఖ కేంద్రంగా తూర్పు కోస్తా రైల్వే జోన్‌ ప్రకటించి రెండేళ్లు అయింది. రాష్ట్రంలోని 3,496 కి.మీ. మార్గమంతా దీని పరిధిలోకి వచ్చేలా అధికారులు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (సమగ్ర ప్రణాళికా నివేదిక)ను పంపారు. దాదాపు రూ.200 కోట్లు అవసరమున్నా... ఇప్పటికీ ముందడుగు పడలేదు. గత బడ్జెట్‌లో కొత్త జోన్‌, రాయగడలో కొత్త డివిజన్‌ ఏర్పాటుకు కలిపి తూర్పుకోస్తా జోన్‌ బడ్జెట్‌లో మొక్కుబడిగా రూ.3 కోట్లు కేటాయించారు. వాటిని రాయగడకే ఖర్చు చేస్తున్నారు.
 
అలాగే, నవ్యాంధ్ర కొత్త రాజధాని అమరావతిని రైలుమార్గంతో అనుసంధానించే ప్రాజెక్టు మంజూరైనా నిధులివ్వడం లేదు. విజయవాడ నుంచి అమరావతి మీదుగా గుంటూరుకు మూడు మార్గాలుగా కలిపి 106 కి.మీ. మేర కొత్తలైన్‌ మంజూరు చేశారు. మాచెర్ల - నల్గొండ(92 కి.మీ.), కాకినాడ - పిఠాపురం (21.5 కి.మీ.), గూడూరు - దుగ్గరాజపట్నం(41.55 కి.మీ.), కొవ్వూరు - భద్రాచలం(151 కి.మీ.), కంభం - ప్రొద్దుటూరు (142 కి.మీ.) కొత్త మార్గాలు మంజూరైనా నిధులు ఇవ్వడంలేదు.
 
ముఖ్యంగా, విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారి-65 వెంట హైస్పీడ్‌ రైల్వేలైన్‌ ప్రాజెక్ట్‌ కావాలని చాలాకాలంగా డిమాండ్‌ ఉంది. ఇదివస్తే తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య ప్రయాణం సులభమవ్వడమే కాకుండా, దూరమూ తగ్గుతుంది. ఈ మార్గంలో హైస్పీడు రైలు ఏర్పాటు చేయాలని ఎంపీలు చాన్నాళ్లుగా కోరుతున్నా స్పందనలేదు. వీటిపై ఈసారైనా విత్తమంత్రి నిర్మలా సీతారమన్ దృష్టిసారిస్తారో లేదో వేచి చూడాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు