దక్షిణాఫ్రికాతో కోల్కతాలో జరిగే రెండో టెస్టుకు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో సెలక్టర్లు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. రెండో టెస్టుకు ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో వృద్ధిమాన్ సాహాతోపాటు సుదీప్ త్యాగి, అభిమన్యు మిథున్లపై సెలక్టర్లు వేటు వేశారు.
వీరిలో సాహా ఒక్కడే తొలి టెస్టులో ఆడగా, మిగతా ఇద్దరికీ అవకాశం లభించనే లేదు. సాహా స్థానంలో గాయం నుంచి కోలుకున్న శ్రీశాంత్కు సెలక్షన్ కమిటీ రెండో టెస్టులో అవకాశం కల్పించింది. అదేవిధంగా దినేష్ కార్తీక్, సురేష్ రైనాలను మళ్లీ జట్టులోకి తీసుకుంది.
హైదరాబాద్ స్టయిలిస్ట్ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ చేతి గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో రెండో టెస్టులో బరిలోకి దింపనుంది. వీవీఎస్ స్థానంలో అవసరమైతే సేవలు అందించడానికి సిద్ధంగా ఉంచిన రోహిత్ శర్మను జట్టు నుంచి సెలక్షన్ కమిటీ అధికారులు తొలగించారు.
బెంగాల్కు చెందిన వికెట్కీపర్-బ్యాట్స్మన్ సాహా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో సున్నాకే అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో కొంత మెరుగైన ఆటతో 36 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.
అయితే, దేశవాళీ పోటీల్లో, ముఖ్యంగా దులీప్ ట్రోఫీ ఫైనల్లో వరుసగా రెండు ఇన్నింగ్స్లోనూ సెంచరీలు సాధించిన మరో వికెట్ కీపర్-బ్యాట్స్మన్ దినేష్ కార్తీక్ను సెలక్టర్లు జట్టులోకి తీసుకునేందుకు పూర్తిగా ఆసక్తి చూపారు.
ఇకపోతే.. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లి, గాయం కారణంగా అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చిన శ్రీశాంత్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. వాస్తవానికి లక్ష్మణ్ తొలి టెస్టులో ఆడాల్సి ఉంది.
రెండో టెస్టులో ఆడే భారత జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, మురళీ విజయ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, బద్రీనాథ్, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, జహీర్ ఖాన్, శ్రీశాంత్, ఇషాంత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా, దినేష్ కార్తీక్, సురేష్ రైనా.