ఇంట్లో భర్త శవం ఉన్నా... బాధను దిగమింగుకుని వెళ్లి ఓటు వేసిన భార్య

ఠాగూర్

మంగళవారం, 14 మే 2024 (08:56 IST)
ప్రజాస్వామ్య దేశంలో పలువురు ఓటు హక్కును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఓటు వేసి తీరుతారు. అందరికీ స్ఫూర్తిదాకయంగా నిలుస్తారు. అలా ఓ మహిళ నిలిచారు. అనారోగ్యంతో చనిపోయిన భర్త శవాన్ని ఇంట్లో ఉన్నప్పటికీ బాధ్యత మరవకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ ఘటన బాపట్ల జిల్లా కారంచేడులో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన గర్నెపూడి చిట్టెమ్మ భర్త సింగయ్య (62) పోలింగ్ రోజైన మే 13 సోమవారం తేదీన అనారోగ్యంతో చనిపోయాడు. 
 
అయినప్పటికీ భర్త శవం ఇంట్లో ఉన్నప్పటికీ ఆమె పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. 178 పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తద్వారా ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్న విలువను ఇతరులకు చాటిచెప్పారు. కాగా, గ్రామంలో చిట్టెమ్మ వీఏవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఓటుపై అవగాహన ఉన్న ఆమె ఎంతో బాధలోనూ ఓటు వేయడం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. దీంతో గ్రామస్థులంతా ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు