వరద ముంపు ప్రాంతాలలో మంత్రుల పరిశీలన... వరదలో బాలిక మృతదేహం

శనివారం, 17 ఆగస్టు 2019 (13:20 IST)
రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని, పామర్రు శాసనసభ్యులు అనిల్ కుమార్ కైలే, తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిధి శనివారం ఉదయం తొట్లవల్లూరు మండలంలోని కృష్ణనది పరివాహక ప్రాంతాలయిన తొట్లవల్లూరు, వల్లూరిపాలెం, లంకపల్లి,తదితర వరద తాకిడికి గురైన ప్రాంతాలను పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ఈ సందర్భంగా మంత్రులు తొట్లవల్లూరులో ఏర్పాటు చేసిన రెండు పునరావాస కేంద్రాలను పరిశీలించి బాధిత కుటుంబాలకు భరోసాను కల్పించారు. ఈ సందర్భం గా రైతులు నీట మునిగిన పంట పొలాలకు నష్టపరిహారం అందించాలని కోరారు.

మంత్రులు రైతులకు థైర్యం చెబుతూ పంట నష్టపోయిన ప్రతి ఎకరాన్ని పరిగణనలోకి తీసుకొని రైతులకు నష్టపరిహారాన్ని అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం చేస్తామన్నారు.
 
వరదలో బాలిక మృతదేహం లభ్యం
పడవ ప్రమాదంలో గల్లంతైన తులసి ప్రియ మృతదేహాన్ని ఎన్డిఆర్ఎఫ్ రెవిన్యూ పోలీస్ సిబ్బంది ఎట్టకేలకు పొదల్లో ఉన్న మృతదేహాన్ని గుర్తించి వరదలో నుంచి బయటికి తీశారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో నిన్న జరిగిన నాటుపడవ బోల్తా పడిన ఘటనలో తులసి ప్రియా గల్లంతయింది.

తండ్రి రమేష్‌తో కలిసి ఊరిలోకి నీరు వస్తుందనే భయంతో  నాటు పడవలో లక్ష్మయ్య వాగు దాటుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న గేదె  పడవను ఢీకొట్టిన ఘటనలో ఒక్కసారిగా పడవ బోల్తా పడింది. ఈ పడవలో నలుగురు ప్రయాణిస్తున్నారు.

అందులో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. తులసిప్రియ మాత్రం గల్లంతయింది. కంచికచర్లలో ఉషోదయ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నది. కంచికచర్లలో బంధువుల ఇంటికి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నా  శోకసంద్రంలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు