బంగ్లాదేశ్‌లో 7 రోజుల పాటు లాక్ డౌన్.. ఎమెర్జెన్సీ సర్వీసులకు మాత్రమే?

శనివారం, 3 ఏప్రియల్ 2021 (14:28 IST)
బంగ్లాదేశ్‌లో మళ్లీ పూర్తి స్థాయిలో ఏడు రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించారు. సోమవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతం అవుతున్న నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపు కల్పించారు. 
 
ఢాకాలో జరిగిన మీడియా సమావేశంలో రోడ్డు రవాణాశాఖ మంత్రి అబ్దుల్ ఖాదిర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్యాక్టరీలను తెరిచి ఉంచనున్నారు. కార్మికులు షిఫ్ట్ పద్దతుల్లో పనిచేసుకునే వీలు కల్పించారు. బంగ్లాదేశ్‌లో ఇప్పటి వరకు ఏడు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సుమారు పది వేల మంది వైరస్ వల్ల మరణించారు.
 
ప్రభుత్వ పాలన శాఖ మంత్రి ఫర్హాద్ హుస్సేన్.. మాట్లాడుతూ, అష్ట దిగ్బంధనం సమయంలో అన్ని కార్యాలయాలు, కోర్టులు మూతపడతాయని చెప్పారు. పరిశ్రమలు, మిల్లులు మాత్రమే రొటేషన్ పద్ధతిలో కార్యకలాపాలు నిర్వహిస్తాయని చెప్పారు.
 
అష్ట దిగ్బంధనం సమయంలో పరిశ్రమలను, మిల్లులను ఎందుకు పని చేయనిస్తున్నారని విలేకర్లు అడిగినపుడు ఫర్హాద్ మాట్లాడుతూ, వీటిని మూసేస్తే వర్కర్స్ తాము పని చేసే ప్రదేశాల నుంచి తమ ఇళ్ళకు వెళ్ళిపోవలసి వస్తుందన్నారు. కాగా.. బంగ్లాదేశ్‌లో శుక్రవారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో కొత్తగా 6,830 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు