ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్ళకు సోమవారం ప్రాణాపాయం తప్పింది. వారు బస చేసిన పార్క్ హయత్ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో హుటాహుటిన ఆ హోటల్ను క్రికెటర్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. హోటల్ మొదటి అంతస్తులో పొగలు రావడంతో హోటల్ సిబ్బంది, అతిథులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో సన్ రైజర్స్ ఆటగాళ్లు ఆరో అంతస్తులోని గదుల్లో బస చేసివున్నారు. ప్రమాద వార్త తెలియగానే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ తమ క్రికెటర్లను మరో హోటల్కు మార్చిది.
కాగా, హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్లో ఉన్న పార్క్ హయత్ హోటల్లోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతోపాటు పొగ కూడా దట్టంగా అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళసిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.