పడక సుఖం ఇవ్వాలంటూ డైరెక్టర్లు ఒత్తిడి... మహిళా ప్రొఫెసర్ ఆరోపణ

వరుణ్

ఆదివారం, 9 జూన్ 2024 (12:18 IST)
హైదరాబాద్ నగరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ మహిళా ప్రొఫెసర్ కళాశాల డైరెక్టర్లపై సంచలన ఆరోపణలు చేశారు. కాలేజీ డైరెక్టర్లు పడక సుఖం ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ ఆమె పేర్కొన్నారు. గండిపేట సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఘటన వెలుగు చూసింది. 
 
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ఐక్యూఏసీ డైరెక్టర్లు సుశాంత్ బాబు, త్రివిక్రమ్ రావులు గత కొంతకాలంగా మహిళా ప్రొఫెసర్‌పై వేధింపులకు పాల్పడుతున్నారు. తమతో గడపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు వారిని హెచ్చరించినా బుద్ధి మార్చుకోలేదని బాధితురాలు వాపోయారు. తాను కాలేజీలో గత 23 ఏళ్లుగా ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాని ఆమె తెలిపారు. 
 
ఈ వేధింపులను భరించలేకే తాను బహిర్గతం కావాల్సి వస్తుందని పేర్కొంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇలాంటి ఘటనలు సర్వసాధారణమంటూ ప్రిన్సిపాల్ నరసింహులు తేలిగ్గా కొట్టి పారేశారని బాధితురాలు ఆరోపించారు. ఈ క్రమంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ బోధన, బోధనేతర సిబ్బంది ధర్నాకు దిగారు. ఇది చూసి ప్రిన్సిపాల్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు.
 
న్యాయం జరగకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సిబ్బంది హెచ్చరించారు. డైరెక్టర్లు సుశాంత్ బాబు, త్రివిక్రమ్ రావులతో పాటు ఇంగ్లిష్ విభాగం హెచ్‌ఓడీ గుప్తాను కూడా తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ ఘటనపై పోలీసుల లోతుగా ఆరా తీస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు