అనుమానం పెనుభూతమైంది.. భార్యను నీటిలో ముంచి చంపేసిన భర్త

బుధవారం, 29 జూన్ 2022 (08:24 IST)
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, వారిద్దరి అనుమానం పెనుభూతమైంది. చివరకు అది ఇద్దిర ప్రాణాలను బలితీసుకుంది. భార్యను నీళ్ల బకెట్‌లో ముంచి భర్త చంపేశాడు. ఆ తర్వాత తానుకూడా రైలుకిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. 
 
హైదరాబాద్‌లోని పంజాగుట్ట డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహరాజు వెల్లడించిన వివరాల మేరకు అస్సాంకు చెందిన మహానంద బిశ్వాస్‌(24), పంపా సర్కార్‌(22) అనే యువతీ యువకులు ప్రేమించుకున్నారు. ఏడాదిన్నర కిందట పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చారు. 
 
తొలుత ఆదిభట్లలోని ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేశారు. తర్వాత పంజాగుట్ట సమీపంలోని ప్రేమ్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటూ బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ మాల్‌లో కాపలాదారులుగా చేరారు. కొన్ని రోజులకే భార్య ప్రవర్తనపై మహానంద బిశ్వాస్‌ అనుమానం వచ్చింది. 
 
ఈ అంశంపై ఇద్దరూ తరచూ ఘర్షణ పడేవారు. సోమవారం మధ్యాహ్నం భార్య పంపా సర్కార్‌తో గొడవపడిన బిశ్వాస్‌ నిండుగా నీరున్న బకెట్‌లో ఆమె తల ముంచి హతమార్చాడు. గదికి తాళం వేసి లక్డీకాపుల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని వంతెన వద్ద రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి వద్ద లభించిన పాకెట్‌ డైరీలో అస్సామీ భాషలో తన భార్యను చంపి, ఆత్మహత్యకు పాల్పడుతున్నానని రాసి ఉండటాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. 
 
ఇంటి చిరునామా సైతం ఉండటంతో పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం పంజాగుట్ట పోలీసులు వారి ఇంటి వద్దకు చేరుకొని తాళం పగులగొట్టి చూడగా.. పంపా సర్కార్‌ బకెట్‌లో మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు