పెళ్లి చేసుకోవాలంటూ యువతికి వేధింపులు.. ఇంటికెళ్లి కత్తితో దాడికి యత్నం

ఠాగూర్

మంగళవారం, 5 మార్చి 2024 (09:29 IST)
తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతిని వేధిస్తున్న యువకుడు ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె తల్లి, తాతపైనా దాడికి పాల్పడి చివరికి వారి చేతిలోనే హతమయ్యాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మల్యాల సీఐ దామోదర్‌ రెడ్డి, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కళ్లపల్లికి రాజేశం జీవనోపాధి కోసం గల్ఫ్‌ వెళ్లాడు. భార్య సత్తవ్వ కుమార్తె(23)తో కలిసి అదే గ్రామంలోని తండ్రి నర్సయ్య వద్ద ఉంటోంది.
 
జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్‌(26) మూడేళ్లుగా సత్తవ్వ కుమార్తె వెంటపడి పెళ్లిచేసుకోవాలని వేధిస్తున్నాడు. ఈ విషయమై మల్యాల ఠాణాలో పలుమార్లు బాధితురాలు ఫిర్యాదు చేయగా 2022లో మహేశ్‌పై కేసు నమోదైంది. నాలుగు రోజుల కిందట యువతి జగిత్యాలలోని కళాశాలకు వెళ్లే సమయంలో దాడికి యత్నించడంతో మళ్లీ ఫిర్యాదు చేయగా మరోసారి కేసు నమోదైంది. అయినా తీరు మార్చుకోని మహేశ్‌ సోమవారం నేరుగా యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడికి యత్నించాడు. తాత, తల్లి అడ్డుకోవడంతో వారిపైనా దాడికి పాల్పడ్డాడు.
 
ప్రతిఘటించే సమయంలో మహేశ్‌ కిందపడగా వారు అక్కడే ఉన్న బండరాయితో తలపై కొట్టడంతో మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ నర్సయ్య, సత్తవ్వలను పోలీసులు జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నర్సయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. మహేశ్‌ తండ్రి ఫిర్యాదుతో యువతితోపాటు ఆమె అన్న, తల్లి, తాత, అమ్మమ్మలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అబ్దుల్‌రహీం తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు