వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఉద్యోగం పేరుతో ఓ యువతిని తల్లీ కొడుకు మోసం చేశారు. ఆ తర్వాత ఆ యువతిని ఇంట్లో బంధించి అశ్లీల చిత్రాల్లో నటించాలంటూ ఒత్తిడి తెచ్చారు. మానసికంగా, శారీరకంగా వేధించారు. ఆరు నెలల పాటు ఓ ఫ్లాట్లో బంధించారు. చివరకు ఆ ఇంటి నుంచి బయటపడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేయడంతో తల్లీ కొడుకులు ఇంటి నుంచి పారిపోయారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన శ్వేతా ఖాన్, ఆమె కుమారుడు ఆర్యన్ ఖాన్లు ఉన్నారు. వీరిద్దరూ ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ పేరుతో ఓ కంపెనీ నడుపుతున్నారు. ఈ కంపెనీ ముసుగులో అశ్లీల వీడియో రాకెట్తో ఓ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్లను కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు నిరుద్యోగులక ఉద్యోగ ఆశ చూపించి తమ గ్రూపులో సభ్యులు చేర్చుకోసాగారు.
ఇదిలావుంటే రాష్ట్రంలోని 24 ఉత్తర పరగణా జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం ఫేస్బుక్ ద్వారా ఆర్యన్ ఖాన్ను సంప్రదించింది. హౌరాలోని తమ ఇంటికి వస్తే ఉద్యోగం ఇప్పిస్తామని ఆర్యన్ నమ్మబలికాడు. దీంతో బాధితురాలు ఉద్యోగ విషయం మాట్లాడేందుకు వారి నివాసానికి వెళ్లింది. అక్కడ ఆర్యన్, అతని తల్లి శ్వేతా ఖాన్ కలిసి ఆ యువతిని బార్ డ్యాన్సర్గా పని చేయాలని అశ్లీల చిత్రాల్లో నటించాలని ఒత్తిడి చేశారు.
అందుకు బాధితురాలు ససేమిరా అనడంతో, ఆమెపై దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కొని ఓ ఫ్లాట్లో బంధించారు. ఆరు నెలల పాటు ఆమెను చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చింది ఫిర్యాదు పేర్కొంది. ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టారని, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే భోజనం పెట్టారని ఆమె వాపోయింది. చిత్ర హింసలు భరించలేక, ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆమె ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉడటంతో ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులైన శ్వేతా, ఆర్యన్ ఖాన్లు పరారీలో ఉన్నారనీ, వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.