ప్రేమ వివాహం... విడాకుల మాటెత్తగానే అడ్డంగా నరికేసిన డాక్టర్ భర్త!

ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (10:14 IST)
అతనో వైద్యుడు. ప్రైవేటు ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో భార్య విడాకులు కోరింది. అంతే.. ఆవేశంతో ఊగిపోయిన భర్త... ఆమెను మట్టుబెట్టాడు. అంతటితో కోపం చల్లారకపోవడంతో కారుతో ఆమె కడుపుపై ఎక్కించి మరీ చంపేశాడు. అడ్డొచ్చిన మామపై కూడా దాడిచేశాడు. ఈ దారుణం కోయంబత్తూరు జిల్లా కొళత్తూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరుకు చెందిన గోకుల్‌కుమార్‌(40) కాటాన్‌ కొళత్తూరులోని ఓ ఆస్పత్రిలో వైద్యుడుగా పనిచేస్తున్నాడు. మరో ప్రైవేటు ఆస్పత్రిలో  పనిచేస్తున్న సమీప బంధువు కీర్తనను ప్రేమించి మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేరు. 
 
చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలోని కృష్ణప్రియనగర్‌లో నివాసం ఉంటున్న కీర్తన తల్లి కుమారి, తండ్రి మురహరి ఇంట్లోనే ఇల్లరికం అల్లుడిగా తొలుత గోకుల్‌ కుమార్‌ ఉండేవాడు. ఇటీవల కీర్తనతో అభిప్రాయభేదాలు రావడంతో ఇద్దరు కలిసి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
 
శుక్రవారం కీర్తన ఇంటికి వెళ్లిన గోకుల్‌ కుమార్‌ ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని అడ్డొచ్చిన మామ మురహరిపై దాడి చేశాడు. కీర్తనను విచక్షణారహితంగా పొడిచి గొంతు కోసి బయటకు లాక్కొచ్చి, కారుతో ఆమెపై దూసుకెళ్లి హతమార్చేశాడు. అక్కడి నుంచి పరారయ్యాడు.
 
దీనిపై సమాచారం అందుకున్న మధురాంతకం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ మురహరిని ఆస్పత్రికి, కీర్తన మృత దేహాన్ని మార్చురికి తరలించారు. కాగా, జాతీయ రహదారిలో కారులో తప్పించుకెళ్తున్న సమయంలో గోకుల్‌కుమార్‌ ప్రమాదానికి గురయ్యాడు. టోల్‌గేటు వద్ద కారు బోల్తాపడడంతో గాయపడి, చెంగల్పట్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు