కరోనాకు డాక్టర్ అగర్వాల్ మృతి... దేశ వ్యాప్తంగా 269 మంది వైద్యులు

మంగళవారం, 18 మే 2021 (15:46 IST)
కరోనా వైరస్ సోకిన కారణంగా దేశ వ్యాప్తంగా 269 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మంగళవారం తెలిపింది. ఈ  మృతి చెందిన వారిలో అత్యధికంగా 78 మంది వైద్యులు బీహార్ రాష్ట్రంలో ఉన్నారు. 
 
అలాగే, ఉత్తరప్రదేశ్ 37 మందితో, ఢిల్లీ 28 మందితో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఐఎంఏ రాష్ట్రాల వారీగా తెలియజేసిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 22 మంది వైద్యులు, తెలంగాణలో 19 మంది, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో చెరో 14 మంది, తమిళనాడులో 11 మంది వైద్యులు కోవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 
 
ఒడిశాలో 10 మంది వైద్యులు, కర్ణాటకలో 8, మధ్యప్రదేశ్‌లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఐఎంఏ మాజీ జాతీయ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత డాక్టర్ కేకే అగర్వాల్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కోవిడ్‌తో సుదీర్ఘ పోరాటం అనంతరం మంగళవారం ఉదయం కన్నుమూశారు.
 
ఈయన కరోనా బారిన పడిన ఆయన గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారు. ఆరోగ్యం విషమించి నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన డాక్టర్ అగర్వాల్ వయసు 62 ఏళ్లు.
 
ఆయన మరణం గురించి ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటన వెలువడింది. నిన్న రాత్రి 11.30 గంటలకు ఆయన మృతి చెందారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనాతో సుదీర్ఘ పోరాటం చేసి తుదిశ్వాస విడిచారని వెల్లడించారు. ఆయన డాక్టర్ అయినప్పటి నుంచి సమాజం కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు.
 
మన దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆయన నిరంతరం తన వంతు కృషి చేశారని ట్వీట్ లో తెలిపారు. ఎన్నో వీడియోల ద్వారా కనీసం 10 కోట్ల మందికి చేరేలా కార్యక్రమాలు చేపట్టి, ఎందరో జీవితాలను కాపాడారని చెప్పారు. తన మరణం పట్ల ఎవరూ బాధ పడకూడదని... ఒక వేడుకలా చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారని తెలిపారు.
 
అంతులేని ఆయన స్ఫూర్తి, కృషిని అందరూ గుర్తుంచుకుందామని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని అందరం ప్రార్థిద్దామని తెలిపారు. మరోవైపు, ఆయన మృతి పట్ల ఎందరో ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు