ప్రాజెక్టు చీతాలో భాగంగా ఆఫ్రికా దేశాల నుంచి భారత్కు మరిన్ని చిరుత పులులు రానున్నాయి. దేశంలో చిరుత పులుల పునరావాసం పేరుతో ప్రాజెక్టు చీతాను కేంద్రం తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశంలో చిరుత పులుల సంఖ్యను మరింతగా పెంచేందుకు కేంద్రం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, మరో ఎనిమిది చీతాలను భారత్కు తీసుకొచ్చిందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో నాలుగు చీతాలను న మీబియా నుంచి, మరో నాలుగు చీతాలను బోత్స్వానా నుంచి తీసుకురానున్నట్లు అటవీశాఖ వర్గాలు తెలిపాయి.
ఈ చిరుతలను ఈ యేడాది ఆఖరునాటికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గాంధీ సాగర్ అభయారణ్యంలో వదిలే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు దక్షిణాఫ్రికా, కెన్యా బృందాలు అక్కడి వాతావరణం, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేసినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు
ముఖ్యంగా, చిరుతలకు తగిన ఆహారం అందించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. జింకలు, కుందేళ్లు, అడవి కుక్కలు, ఇతర చిన్న వన్యప్రాణులను అభయారణ్యంలో ప్రవేశపెడుతున్నారు. ఇది చిరుతల వేట సామర్థ్యాన్ని పెంచడమే కాక, వాటి జీవన విధానానికి అనుగుణంగా ఉంటుందని అధికారులు చెప్పారు.
ప్రాజెక్టు చీతాలో భాగంగా తొలుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్లోకి 20 చీతాలను తెచ్చారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వాటిలో 9 చిరుతపులులు మృతి చెందాయి. మిగిలినవి ఇప్పటికీ సజీవంగా ఉండగా, కొన్ని చిరుతలు పిల్లల్ని కనడం సానుకూల సూచనగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27 చీతాలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.