నల్గొండలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురుకి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 21వ తేదీన నకిరేకల్ గురుకులంలో పరీక్ష మొదలైన కాసేపటికి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసుల కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
అరెస్టు చేసిన వారిలో ఏ1 చిట్ల ఆకాశ్, ఏ2 బండి శ్రీనివాస్, ఏ3 చిట్ల శివ, ఏ4 గుడుగుంట్ల శంకర్, ఏ5 బ్రహ్మదేవర రవిశంకర్, ఏ6 మైనర్ బాలుడుని నకిరేకల్ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత జడ్జి ఆదేశాల మేరకు ఆరుగురికి రిమాండ్ విధించారు. ఇదిలావుంటే, ఈ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అలాగే ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేసింది.
నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్లోని ఎస్ఎల్బీసీ బాలికల గురుకుల పాఠశాల సెంటరులో తెలుగు ప్రశ్నపత్రం లీకైన విషయం తెల్సిందే. ఈ లీక్ వ్యవహారంలో డ్యూటీలో ఉన్న ఉన్నతాధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై చర్యలు తీసుకున్న విద్యాశాఖ అధికారులు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్ను ఉద్యోగం నుంచి తొలగించి ఇన్విజిలేంటర్ను విద్యాశాఖ సస్పెండ్ చేశారు.