ప్రణయ్ హత్య.. నిందితులు ఏడుగురు మీడియా ముందు... నాన్నకు ఉరి వేయాల్సిందే... అమృత

మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (19:40 IST)
సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు నల్గొండ ఎస్పీ రంగనాథ్ మంగళవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రణయ్‌ను హత్య చేసేందుకు గత ఆగస్టు నెల నుంచి ప్రయత్నిస్తూనే వున్నారనీ, మిర్యాలగూడలోని బ్యూటీ పార్లర్ వద్ద ఆగస్టు 14న అతడిని చంపేందుకు తొలిసారి ప్రయత్నించారని వెల్లడించారు.
 
ఆ తర్వాత ఆగస్టు 17న వెడ్డింగ్ రిసెప్షన్ నాడు ప్రయత్నించి కుదరక వెళ్లిపోయారన్నారు. ఆ తర్వాత మరోసారి ఆగస్టు 22న అతడి ఇంటి వద్దే మట్టుబెట్టేందుకు ప్రయత్నించగా ప్రణయ్ వేగంగా కారులోకి ఎక్కడంతో పథకం పారలేదన్నారు. చివరికి 14వ తేదీనాడు ప్రణయ్‌ను పక్కా ప్రణాళికతో హతమార్చారని ఎస్పీ వివరించారు.
 
ఈ హత్య చేసేందుకు హత్య చేసిన అస్గర్ కోటి రూపాయలను డిమాండ్ చేశాడనీ, ఐతే చివరికి రూ. 50 లక్షలకు ఒప్పుకున్నాడని వెల్లడించారు. ఈ హత్యలో భాగస్థులైన ఏడుగుర్ని అరెస్టు చేశామనీ, నిందితుల పేర్లను మీడియాకు వివరించారు. 
 
ఏ1 - మారుతీ రావు (అమృత తండ్రి)
ఏ2 - సుభాష్ శర్మ (బీహార్)
ఏ3 - అస్గర్ అలీ
ఏ4 - మహ్మద్ బారీ
ఏ5 - అబ్దుల్ కరీం
ఏ6 - శ్రవణ్ (బాబాయ్)
ఏ7 - సముద్రాల శివగౌడ్ (డ్రైవర్)
 
మరోవైపు తన భర్తను హతమార్చిన తన తండ్రితో పాటు మిగిలినవారినందరినీ ఉరి తీయాలని అమృత డిమాండ్ చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు