హైదరాబాద్‌లో విషాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు తీసిన కోతి

గురువారం, 31 డిశెంబరు 2020 (20:24 IST)
2020 వెళుతూ వెళుతూ ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచేసింది. తన పని తాను చేసుకుంటూ.. కుటుంబానికి ఆసరాగా ఉన్న యువకుడు.. కుటుంబ సభ్యుల ముందే కన్నుమూశాడు. కోతులను అదిలించబోయి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషాద ఘటన నగరంలోని కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
 
కూకట్‌పల్లి జయనగర్‌లో కోతుల బెడత ఎక్కువైంది. కోతిని కొట్టబోయి విద్యుత్ షాక్‌తో సాప్ట్‌వేర్ ఉద్యోగి లోకేష్ మృతిచెందాడు. లోకేష్.. సాప్ట్‌వేర్ ఉద్యోగి కావడంతో వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంట్లో నుంచే విధులు నిర్వహిస్తున్నాడు.

అయితే మంగళవారం మధ్యాహ్నం రెండో ఫ్లోర్‌లో ఉన్న తన ఇంట్లోకి కోతులు రావడంతో వాటిని బెదరగొట్టేందుకు ఇనుపరాడ్‌తో కొట్టబోయాడు. దీంతో ఇనుపరాడ్‌ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగలడంతో షాక్‌కు గురయ్యాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆస్పత్రికి చేరుకునేలోపే లోకేష్ ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబంలో, కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు