దాదాపు తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకునిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచర ఆస్ట్రోనట్ బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమికి చేరుకోనున్నారు. వారిద్దరూ అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చి భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. వ్యోమగాములను భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లోకి వారు సురక్షితంగా చేరుకున్నారు. ఆ తర్వాత ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి భూమికి పయనమైంది.
కాగా, భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15 గంటలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. ఇది పూర్తయిన తర్వాత ఉదయం 10.15 గంటలకు అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. ఇక భూవాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున 2.41 గంటలకు చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3.27 గంటలకు వ్యోమ నౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది.
సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికి తీస్తాయి. ఆ తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను పుడమిపై పాదం మోపుతారు. 2024 జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్లైనర్లో వీరిద్దరూ ఐఎస్ఎస్కు చేరుకున్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వీరిద్దరూ వారం రోజుల్లోనే తిరిగి భూమికి చేరుకోవాల్సి వుంది. కానీ, స్టార్లైనర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి చేరుకుంది. నాటి నుంచి వీరిద్దరూ అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకునిపోయారు.