అధికారంలోకి వస్తే ఇంటింటికి రూ.4 వేల పింఛన్ : చంద్రబాబు

వరుణ్

సోమవారం, 25 మార్చి 2024 (17:24 IST)
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే అర్హులైన ప్రతి ఇంటికి నెలకు రూ.4 వేలు పింఛన్ ఇస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు ముందు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని చెప్పారు. కుప్పంలో హింస, దోపిడీ రాజకీయాలు చేస్తున్నారని, పుంగనూరు నుంచి వచ్చిన వ్యక్తి దోచుకున్న డబ్బు మొత్తాన్ని కక్కిస్తానని అన్నారు. 
 
'ఇప్పటిదాకా మీరు నాపై ఏడుసార్లు అభిమానం చూపించారు. కుప్పంలో వైకాపా అభ్యర్థికి ఈసారి డిపాజిట్లు కూడా రాకూడదు. నియోజకవర్గ అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం అడ్డుపడింది. కుప్పానికి హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తెదేపా కూటమి ప్రభుత్వానిది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక పోలీసులతో వారిని నియంత్రిస్తాం. ఎన్నికలు సజావుగా జరగనివ్వాలని రౌడీలను హెచ్చరిస్తున్నా. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా.. జైలు నుంచి బయటికి రాగానే పార్టీ జెండా మోయడం ఆపలేదు. 
 
వైకాపా నాయకులు యథేచ్చగా గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్నారు. కేజీఎఫ్‌ తరహాలో శాంతిపురంలో గ్రానైట్‌ తవ్వేశారు. ఈ సారి కుప్పంలో టీడీపీకి లక్ష మెజార్టీ లక్ష్యం. పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నా. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తెదేపా కూటమిని గెలిపించాలి' అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 
 
'వచ్చే ఐదేళ్లలో కుప్పంను అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు నాదే. వై నాట్‌ 175 అని జగన్‌ అంటున్నారు. వై నాట్‌ పులివెందుల.. అని నేను పిలుపునిస్తున్నా. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టను నేనే అభివృద్ధి చేశా. ఆ తర్వాత దాని చుట్టుపక్కల భూముల రేట్లు పెరిగాయి. రికార్డులు మార్చేసి పేదవాళ్ల భూములు లాక్కుంటున్నారు. వైకాపా నేతల వేధింపుల వల్లే సుబ్బారావు కుటుంబం చనిపోయింది. ఆయన కుమార్తెకు భరోసా ఇచ్చా. భూమి అప్పగిస్తామని చెప్పా. భూముల కోసం ఎన్‌ఆర్‌ఐను వేధించారు. మన భూమి, స్థలాలను కాపాడుకునేందుకు ఇన్ని బాధలు పడాలా? నంద్యాలలో అబ్దుల్‌ సలాం ఎంతో మనోవేదనతో చనిపోయాడు. అరాచకాలకు అడ్డుకట్టవేయాలంటే తెదేపా అధికారంలోకి రావాలి' అని చంద్రబాబు అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు